హైదరాబాద్ : వాహన దారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. లెర్నర్ లైసెన్స్కు ముందు ఆన్లైన్ రోడ్డు భద్రతా పరీక్షను తప్పనిసరి చేసింది . దీంతో వాహనదారులకు కోలుకోలేని షాక్ తగిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్ను జోడించడం ద్వారా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని కొత్త రవాణా శాఖ విధానం లక్ష్యంగా పెట్టుకుంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణంగా భావిస్తోంది . సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు లేని చాలా మంది డ్రైవర్లు తమ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. అధికారిక అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో దాదాపు 1.7 లక్షల మంది మరణిస్తున్నారని పేర్కొంది రవాణా శాఖ.
ఒక్క తెలంగాణలోనే ఏటా సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా, దాదాపు 23,000 మంది గాయపడుతున్నారు. ఈ ఆందోళనకరమైన గణాంకాల దృష్ట్యా, రోడ్డు ప్రమాదాలు, మరణాలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది కూడా. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ రోడ్డు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో కీలక మార్పులు తీసుకు రావాలని శాఖ యోచిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష. వీటికి తోడు అదనంగా ఆన్లైన్ రోడ్డు భద్రతా అవగాహన మాడ్యూల్ పరీక్షను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.
