మహబూబ్ నగర్ జిల్లా : మా ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఢిల్లీ కి రాజు అయినా తల్లికి బిడ్డ అన్నట్లుగా నేను పాలమూరు బిడ్డను అని పేర్కొన్నారు. దివిటిపల్లిలో అమర రాజా అద్భుతమైన పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసిందన్నారు. 1983 లో అమర రాజా చిత్తూరు జిల్లాలో మొదటి సంస్థను ఏర్పాటు చేసి 40 ఏళ్లు అవుతోందని చెప్పారు. చైనా, జపాన్, జర్మని, కొరియా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకుని అమర రాజా సంస్థ పని చేస్తోందన్నారు. ప్రపంచంలో చైనా ఈవీ వెహికిల్స్ కు లీడర్ గా ఉందన్నారు. ఈవీ లో చైనాతో అమర రాజా సంస్థ పోటీ పడి పనిచేస్తోందంటూ కితాబు ఇచ్చారు. కాలుష్యం వేగంగా విస్తరిస్తోందని, వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయంటూ పేర్కొన్నారు.
ఎలినినో ప్రభావం కారణంగా వర్షాలు పడటం లేదు.. రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు సీఎం. కోవిడ్ తర్వాత వాతావరణంలోచాలా మార్పులు వచ్చాయని, కాలుష్యం తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్య నియంత్రలో ఈవీ వెహికిల్స్ అవసరం ఉందని పేర్కొన్నారు. దివిటిపల్లి అమర రాజా యూనిట్ లో 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. ఇందులో 400 మంది మహిళా ఉద్యోగులు ఉండటం మహిళా సాధికారిత కు నిదర్శనం అన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు, 2004 నుంచి 2014 వరకు వైస్ రాజశేఖర్ రెడ్డి, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు గత ప్రభుత్వాలు తీసుకు వచ్చిన పాలసీలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల పాలసీల్లో ఉన్న మంచిని మేం కూడా ప్రోత్సహిస్తున్నాం అన్నారు.
