తిరుపతి : పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ ఆలయాన్ని సందర్శించి భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భారత పురావస్తు శాఖ ఆధీనంలోని ఈ ప్రాచీన ఆలయంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి ఏఎస్ఐ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పురావస్తు శాఖ సూచనల మేరకు ప్రతిపాదనలు సమర్పించి అనుమతులు పొందనున్నట్లు వెల్లడించారు.
తాగునీటి సౌకర్యాల మెరుగుదల, క్యూ లైన్ల అభివృద్ధి, మెట్ల మరమ్మతులు, యాగశాల నిర్మాణం అనంతరం పోటు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను గుర్తించినట్లు చెప్పారు జేఈవో. భక్తుల రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించేలా క్యూ లైన్లను ఒకే విధమైన ఆకృతిలో తీర్చిదిద్దేందుకు ఏఎస్ఐ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అదేవిధంగా కళ్యాణ మండపం, ఆలయ ప్రాంగణంలోని ఇతర సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి పురావస్తు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు లభించిన వెంటనే వాటిని వేగంగా పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని జేఈవో తెలిపారు.
