తమిళనాడు : ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల అనుబంధం ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమిళనాడు ఎన్నికల సందర్బంగా మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి ఎన్టీఆర్ తాగునీరు ఇచ్చారన్నారు.
తిరువళ్ళూర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ నుంచి వచ్చారని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎంతో మంది ఉన్నతాధికారులు దేశానికి సేవ చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
తమిళ ప్రజలకు వారి భాష అంటే ఎంతో ప్రేమ, కష్టించి పని చేసే మనస్తత్వం వారిదన్నారు. ఏపీ తమిళనాడు రాష్ట్రాల ప్రజలది అన్నదమ్ముల కంటే ఎక్కువ బంధం ఉదన్నారు. ఘనమైన వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు అని పేర్కొన్నారు. మన దేశానికి ఓ సంస్కరణ వాది ప్రధానిగా ఉన్నారన్నారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధి పోటీ ఉందని, దీనికి కేంద్ర ప్రోత్సాహం కూడా ఉందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని కాంగ్రెస్, డీఎంకే అంటున్నాయన్నారు. కానీ వారు మహిళలను ఓడించారని పేర్కొన్నారు సీఎం. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు. కొత్త సెన్సస్ ప్రకారం అయితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేదన్నారు.
