చెన్నై : తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల హడావుడి పీక్ స్టేజ్ కు చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ప్రధానంగా ప్రముఖ నటుడు దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీపై అందరి చూపు నెలకొని ఉంది. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించాడు అధ్యక్షుడు. తాజాగా పుదుచ్చేరిలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కీలక ప్రకటన చేశాడు. ఇందులో భాగంగా మొత్తం 30 మంది అభ్యర్థులను ఖరారు చేశాడు. వచ్చే ఏప్రిల్ నెల 9న జరగనున్న ఎన్నికల్లో ఈ పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనుంది, ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 30 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభ ప్రస్తుత పదవీకాలం జూన్ 15న ముగియనుంది.
2021 శాసనసభ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఆరు స్థానాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఆరు స్థానాలతో సరి పెట్టుకున్నాయి. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలతో స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఏఐఎన్ఆర్సీ ఎనిమిది స్థానాలను, ఏఐడీఎంకే నాలుగు స్థానాలను, డీఎంకే రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆ సమయంలో ఓటింగ్ శాతం 83.6 శాతంగా నమోదైంది. ఏఐఎన్ఆర్సీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ మార్చి 21న తన మొదటి జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి 18న సమావేశమైంది.
