ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. తాజాగా ట్విట్టర్ కు కొత్త బాస్ రానున్నారని, త్వరలోనే సిఇఓను నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎవరు తదుపరి సిఇఓగా ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం లిండా యాక్కారినో తదపురి బాస్ గా కొలువు తీరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆమె పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఉదారవాద కళలు, టెలికమ్యూనికేషన్లను అభ్యసించారు. ప్రస్తుతానికి లిండా యాకారినో ఎన్ బి సి యూ లో అడ్వర్టైజింగ్ హెడ్ గా కొనసాగుతున్నారు. ఆమె ఒక దశాబ్దానికి పైగా పని చేస్తున్నారు. యాడ్స్ మరింత తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్ బీ సీ యూ అడ్వర్టైజింగ్ సేల్స్ హెడ్ గా , కంపెనీకి సంబంధించి యాడ్ సపోర్టెడ్ పీకాక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను ప్రారంభించడంలో ఆమె కీల పాత్ర పోషించారు.
లిండా యక్కారినో టర్నర్ ఎంటర్ టైన్ మెంట్ లో 19 ఏళ్ల పాలు సేవలు అందించారు. నెట్ వర్క్ కు సంబంధించి ప్రకటనల విక్రయాల ఆపరేషన్ ను డిజిటల్ రంగంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. గత నెలలో మియామీలో జరిగిన ఒక అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ లో యాక్కరినో ఎలాన్ మస్క్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఆయన పని పట్ల కనబరిచే శ్రద్దను, నీతి నిజాయితీని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
