PM Narendra Modi: ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ లో పాక్ పై నిప్పులు చెరిన ప్రధాని మోదీ
ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్ లో పాక్ పై నిప్పులు చెరిన ప్రధాని మోదీ
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ… అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ తో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రధాని మోదీ(PM Narendra Modi) వెల్లడించారు. అందులో తన చిన్ననాటి విషయాలు, హిమాలయాల్లో గడిపిన రోజులు, ప్రజాజీవితంలో తన ప్రయాణం సహా పాకిస్తాన్(Pakistan) భారత్ ల మధ్య శాంతికోసం ప్రయత్నించిన అంశాలను ఆయన చర్చించారు. ఈ సందర్భంగా దాయాది దేశం పాకిస్తాన్ పై ఆయన నిప్పులు చెరిగారు.
లెక్స్ ఫ్రిడ్మాన్(Lex Fridman) తో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ… దాయాది దేశం పాకిస్తాన్ కి విశ్వసనీయత అనేదే లేదని మండిపడ్డారు. పాక్ తో భారత్ ఎన్నోసార్లు శాంతియత్నాలు చేసింది. ఆ దేశంతో దౌత్య సంబంధాల మెరుగుదలకు ఎన్నడూ లేనంతగా కృషి చేశా. నా ప్రమాణస్వీకారానికి కూడా ఆహ్వానించా. కానీ ప్రతిసారీ వారినుంచి శత్రుత్వం, నమ్మకద్రోహమే స్వాగతం పలికాయి. పాక్లో అస్థిరత, అశాంతి, ఉగ్రవాదం తిష్టవేశాయి. ఇప్పటికైనా మార్పొస్తుందని, వాళ్లు శాంతిపథంలో పయనిస్తారని ఆశిస్తున్నాం. పాక్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పరస్పర విశ్వాసాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత పాక్ దేనని స్పష్టం చేశారు.
PM Narendra Modi – చర్చలతోనే ఉక్రెయిన్, రష్యాలకు పరిష్కారం
ప్రస్తుత పరిస్థితులు ఉక్రెయిన్, రష్యా(Russia) మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తున్నాయి. ముందుగా ఆ రెండు దేశాలూ చర్చించుకోవడం అవసరం. అమెరికాతో సహా ఎన్ని దేశాలు అండగా ఉన్నా యుద్ధక్షేత్రంలో పరిష్కారాలుండవని ఉక్రెయిన్(Ukraine) కూడా గ్రహించాలి. చర్చలు, సంప్రదింపులే మార్గం. రెండు దేశాలతోనూ నాకు సత్సంబంధాలున్నాయి. యుద్ధం పరిష్కారం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్కు నేరుగా చెప్పగలను. భారత్, చైనా మధ్య పోటీ తత్వం ఉండాల్సిందే. అది స్పర్ధగానే సాగాలి తప్ప సంఘర్షణగా మారకూడదు. విభేదాలు వివాదాలు కారాదు. వాస్తవాధీన రేఖ వెంట 2020 ఏడాదికి ముందునాటి పరిస్థితులు నెలకొల్పేందుకు ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. ప్రాచీనకాలం నుంచీ ఇరుదేశాలు పరస్పరం ఎంతో నేర్చుకున్నాయి. ఒక దశలో సగం ప్రపంచ జీడీపీని ఈ రెండు దేశాలే సమకూర్చాయి.
ట్రంప్ 2.0 క్లియర్ రోడ్ మ్యాప్ తో ఉన్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు, నాకు మధ్య పరస్పర నమ్మకముంది. ఇరువురం జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేసేవాళ్లమే. ట్రంప్ కు తెగువ ఎక్కువ. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. రెండోసారి అధ్యక్షునిగా మరింత సన్నద్ధతతో వచ్చారాయన. క్లియర్ రోడ్మ్యాప్తో ముందుకెళ్తున్నారు’’ అని మోదీ అన్నారు.
నా బాల్యమంతా దుర్భర దారిద్య్రమే
తన బాల్యం, చాయ్ వాలా రోజులు మొదలుకుని చావుపుట్టుకల దాకా పలు అంశాలపై మనోగతాన్ని పంచుకున్నారు. తన బాల్యం దుర్భర పేదరికం మధ్యే గడిచిందని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘స్కూలుకు వేసుకెళ్లడానికి బూట్లు కూడా ఉండేవి కాదు. ఒకసారి చిన్నాన్న తెల్లరంగు కాన్వాస్ షూ కానుకగా ఇచ్చాడు. వాటిని పాలిష్ చేసుకోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. దానితో క్లాస్ రూముల్లోని చాక్ పీస్ పొడితో పాలిష్ చేసుకునేవాన్ని. కానీ పరిస్థితులను చూసి నేనెన్నడూ డీలా పడలేదు. ప్రతి దశనూ వినమ్రంగానే స్వీకరిస్తూ ముందుకు సాగా. మా నాన్న చాయ్ దుకాణానికి వచ్చేవారిని చూసి, వారి మాటలు విని ఎంతో నేర్చుకున్నా. ఆ అనుభవాల సారాన్ని ప్రజాజీవితంలో అమలు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
‘‘నా శక్తి నా పేరులో లేదు. నా వెనక దన్నుగా నుంచున్న 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో దాగుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఏదో సాధించేందుకే పైవాడు నన్నిక్కడికి పంపాడు. ఆ ప్రయత్నాల్లో నేను ఏనాడూ ఒంటరిగా లేను. నన్నిక్కడికి పంపిన ఆ శక్తే అన్నివేళలా నాకు తోడుగా నిలుస్తూ వస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘నేను శక్తిమంతుడినని ఎన్నడూ అనుకోను. అలా చెప్పుకోను కూడా. వినయంతో కూడిన ప్రధాన సేవకున్ని మాత్రమే అని చెప్పుకుంటా’’ అన్నారు.
ఆర్ఎస్ఎస్ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నా
ఆర్ఎస్ఎస్ వంటి గొప్ప సంస్థ నుంచి జీవిత పాఠాలు నేర్చుకోగలగడం నా అదృష్టం. అంత పెద్ద స్వచ్ఛంద సంస్థ మరోటి లేదనుకుంటా. గుజరాత్ లో మా ఇంటి సమీపంలో ఆర్ఎస్ఎస్ ‘శాఖ’ నిర్వహించేటప్పుడు వినిపించే దేశభక్తి గీతాలు నాలో దేశంపట్ల ప్రేమను విపరీతంగా పెంచాయి.
గోధ్రా అల్లర్లను ఎక్కువచేసి చూపారు
2002 గోధ్రా అల్లర్లను మరీ ఎక్కవ చేసి చూపారు. అవి గుజరాత్ చరిత్రలోనే అత్యంత దారుణమైన గొడవలన్నట్టుగా ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. నిజానికి నేను సీఎం కావడానికి చాలాకాలం ముందునుంచే గుజరాత్ లో దాదాపు ఏటా మత కల్లోలాలు జరిగేవి. కానీ 2002 నుంచి అవి పూర్తిగా ఆగిపోయాయి.
నా జీవితాన్నే మార్చేసిన ఉపవాసం
ఉపవాసం తన జీవితాన్నే మార్చేసిందని మోదీ చెప్పారు. ‘‘ఉపవాసం సనాతన ఆచారం. దానితో లాభాలు అన్నీ ఇన్నీ కావు. జ్ఞానేంద్రియాలను పదును పెడుతుంది. ఎరుకను పెంచుతుంది. రొటీన్ కు భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తాం. సూక్ష్మ విషయాలను కూడా గుర్తించగలం. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవాలు’’ అని వివరించారు. ఈ పాడ్కాస్ట్ కోసం తాను 45 గంటలుగా ఉపవాసమున్నానని, మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదని ఫ్రిడ్మాన్(Lex Fridman) చెప్ప డంతో ప్రధాని నవ్వేశారు. ‘నాకిది నిజంగా గొప్ప గౌరవం’ అన్నారు.
రష్యా మూలాలున్న ఫ్రిడ్మాన్ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధకుడు. 2018 నుంచి ‘లెక్స్ ఫ్రిడ్మాన్’ పేరుతో పాడ్కాస్ట్లు నిర్వహిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, రాజకీయ రంగాల్లోని ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో సహా అనేక మందిని ఇంటర్వ్యూ చేశారు. ఆయనకు యూట్యూబ్లో 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Also Read : Ayodhya Ram Mandir: ప్రభుత్వానికి 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు