Donald Trump: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
Donald Trump : పహల్గాం చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా ప్రపంచం నలుమూలలకు చెందిన నాయకులు అభివర్ణిస్తున్నారు. పర్యాటకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్ కు తమ బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin), ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ సహా ప్రపంచ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించి, భారతదేశానికి సంఘీభావాన్ని తెలియజేశారు.
Donald Trump – ఉగ్రదాడిపై ట్రంప్, మోదీ ఫోన్ సంభాషణ
పహాల్గాం ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన దాడిలో అమాయకులు మరణించడం పట్ల ట్రంప్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు భారత్ కు అమెరికా పూర్తి సపోర్ట్ చేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన అఫీషియల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారని జైస్వాల్ తెలిపారు.
ఉగ్రదాడిపై పుతిన్, మెలోని స్పందన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని “క్రూరమైన నేరం”గా అభివర్ణించి, దీనికి ఎటువంటి సమర్థన లేదన్నారు. దాడికి బాధ్యులైన వారు తగిన శిక్షను ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని కూడా ఈ దాడి పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు, గాయపడినవారు, భారత ప్రజలకు ఆమె సంఘీభావాన్ని తెలిపారు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిచి వేసిందన్నారు. భారత ప్రభుత్వానికి, బాధితులకు మా పూర్తి మద్దతు ఉంటుందని మెలోని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ కూడా భారతదేశంతో నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
భారత్ లో పెల్లుబికిన ఆగ్రహం, భద్రతా చర్యలు
పహాల్గాం ఉగ్రదాడిని భారత్ లోని అన్ని వర్గాలు ఖండించాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను “హీనమైన చర్య”గా అభివర్ణించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కార్యకలాపాలు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడి భారత్ను మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో ఐక్యంగా నిలబడాలని పలు దేశాల నాయకులు పిలుపునిచ్చారు.
Also Read : Rahul Gandhi: అమిత్ షాకు రాహుల్ గాంధీ ఫోన్ ! పహల్గాం ఉగ్రదాడి గురించి ఆరా !