MLA Harish Rao : రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఇబ్బందులు తప్ప అభివృద్ధి శూన్యం
ఏదైనా అంటే తమ వద్ద డబ్బులు లేవని అంటారన్నారు...
Harish Rao : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణను నిలబెడితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండపెడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లి నీ మార్చారన్నారు. కేసీఆర్ గుర్తులను మారుస్తామని కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ చెప్పిన అభివృద్ధిని మారుస్తారా? అంటూ ప్రభుత్వ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Harish Rao Slams CM Revanth Reddy
బిఆర్ఎస్ హయాంలో కరెంట్ పోయేది కాదని కానీ ప్రస్తుతం కరెంట్ కోతలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆగస్ట్ 15వ తేదీలోగా రైతు రుణ మాఫీ చేస్తానని యాదాద్రి దేవుడిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒట్టు వేశారని.. అలా ఒట్టు వేసి దేవుడునే మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన రెట్టింపు పింఛన్ ఇస్తామని చెప్పి.. అది కూడా ఇవ్వలేదన్నారు. గజ్వేల్ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేదన్నారు. జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రజలు పేర్కొంటున్నారన్నారు రైతుల కోసం జిలుగు విత్తనాలు రూ. 11 వందలు ఉంటే వాటిని రూ. 22 వందలు చేశారని రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు.
ఏదైనా అంటే తమ వద్ద డబ్బులు లేవని అంటారన్నారు. కానీ అందాల పోటీలు పెట్టీ.. వాటి కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. అందాల పోటీలు పెట్టీ ఇంగ్లాండ్ అమ్మాయిని రేవంత్ దోస్తులు ఇబ్బంది పెట్టితే ఆమె పారిపోయిందని గుర్తు చేశారు. మహిళల పట్ల రేవంత్ రెడ్డి దోస్తులు అనుచితంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు. జనానికి జిలుగు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. రూ. 1,100 కోట్లు బోనస్ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడని పేర్కొన్నారు.
వడ్ల పైసలు ఇంకా పడట్లేదన్నారు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. తిప్పికొడితే 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇక గురుకులాల్లో అభివృద్ధి సైతం లేదన్నారు. విందులు వినోదాల కోసమే ఈ అందాల పోటీలు పెట్టారన్నారు. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు మాత్రమే వచ్చిందని తెలిపారు. మూసి నది పునరుద్ధరీకరణ అని చెప్పి.. దానిని అక్కడే వదిలేశారని.. అలాగే హైడ్రా అని దాన్ని కూడా వదిలేశారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఏది ప్రారంభించినా రేవంత్ సర్కార్ ముందుకెళ్లిందే లేదన్నారు.
ఇక కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగా నడిచేదన్నారు. కానీ నేడు భూములు కొనే వారే కరువయ్యారని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఈగలు తోలుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజలు ఇల్లు కట్టున్నారని.. కానీ ప్రస్తుతం అవే ఇండ్లను బ్యాంకులకు తనకా పెడుతున్నారని చెప్పారు. గజ్వేల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే 3 సంవత్సరాలలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. రాజీవ్ యువశక్తి పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ కేసీఆర్ హయాంలో ఏ అభివృద్ధి అయినా అందరికీ అందిందన్నారు. వీళ్లేమో ప్రజలకు ఇవ్వరంటా, కాంగ్రెస్ నాయకులకే ఇస్తారంట అంటూ ప్రభుత్వ నేతలపై హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read : Minister Veeranjaneya Swamy : వైసీపీ పెట్టుబడులను తరిమికొడితే..టీడీపీ పెట్టుబడులు తెస్తుంది