MP Kanimozhi : భారతదేశ అధికార భాషపై వచ్చిన ప్రశ్నకు స్మార్టుగా సమాధానం ఇచ్చిన ఎంపీ
ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం వచ్చిందన్నారు.
MP Kanimozhi : ఆపరేషన్ సిందూర్ వివరాలు, ఉగ్రవాదంపై భారత్ పోరును వివరించేందుకు విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
MP Kanimozhi Comments Viral
భారతదేశంలో అధికార భాషపై అడిగిన ఒక ప్రశ్నకు తూత్తుకుడి ఎంపీ కనిమొళి సమాధానమిస్తూ, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష అని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం వచ్చిందన్నారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ఇవాళ చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని కనిమొళి(MP Kanimozhi) చెబుతున్నప్పుడు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారని, ఏ ఒక్క భాషను జాతీయ భాషగా ప్రకటించ లేదని, అయితే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద అధికారిక భాషలుగా 22 భాషలను గుర్తించారని చెప్పారు.
ఉగ్రవాదంపై మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నామని, ఆ పని చేస్తున్నామని, ఇంకా చేయాల్సింది ఉందని చెప్పారు. ఇండియా సురక్షిత దేశం అని, కశ్మీర్ సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకు భిన్నంగా ఎవరు ఏమి చేయాలనుకున్నా వారి ఆటలు సాగనీయమని అన్నారు. కనిమొళి ప్రతినిధుల బృందంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ కుమార్ రాయ్, బీజేపీ ఎంపీ బ్రిజేష్ చౌతా, ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, మాజీ దౌత్యవేత్త మంజీవ్ సింగ్ పురి ఉన్నారు.
Also Read : Raghurama Krishna Raju : గంజాయి బ్యాచ్ కు మాజీ సీఎం మద్దతివ్వడం బాధాకరం
