DK Shivakumar: దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !
దిల్లీ డీకే వర్గీయుల పయనం ! ఆశక్తికరంగా కన్నడ రాజకీయాలు !
DK Shivakumar : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) క్యాంపు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. సీఎం మార్పునకు కాంగ్రెస్ (Congress) అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో డీకేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పాలని కోరనున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
DK Shivakumar Political Updates
ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్ను తెలియజేయనున్నట్లు సమాచారం. రేపు ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలుస్తారని తెలుస్తోంది. దిల్లీకి వెళ్లిన వారిలో దినేశ్ గూలిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసు ఉన్నారు. అనేకల్ శివన్న, నేలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగ బసవరాజు, బాలకృష్ణ తదితరులు శుక్రవారం దేశ రాజధానికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక్బాల్ హుస్సేన్ ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఎందుకు వెళ్తున్నాను? బంగారం, వజ్రాలేమైనా అడుగుతానా?. లేదు కదా.. నేను డీకే శివకుమార్ కోసం వెళ్తున్నాను’’ అని అన్నారు.
అంతకు ముందు శివకుమార్ సోదరుడు సురేశ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. బహుశా ఆయన అధికార విభజనకు సంబంధించే మాట్లాడి ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో సిద్ధరామయ్య వాదన మాత్రం మరోలా ఉంది. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. పూర్తికాలం పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేరుగా అధికార విభజన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ‘నవంబర్ రెవల్యూషన్’ అంటూ వస్తున్న ప్రచారం కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాను పదవిలో కొనసాగుతానా.. లేదా.. అనే చర్చ అనవసరమని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లు ముగిసిన నేపథ్యంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను పరిశీలించొచ్చని అధిష్ఠానానికి సూచించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీతో చర్చించి చెబుతానని ఖర్గే హామీ ఇచ్చినట్లు చెప్పారు. దాన్నే కొందరు ‘పవర్ షేరింగ్’గా బయట ప్రచారం చేస్తున్నారన్నారు. అంతే తప్ప అధికార విభజనపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు.
Also Read : Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్’
