అమరావతి : మోదీ సర్కార్ నిర్వాకంపై , అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శనివారం తిరుపతి జిల్లాలో సాగింది. సూళ్లూరుపేట నియోజక వర్గం కోటపోలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు షర్మిలా రెడ్డి. గ్రామస్థులు మన్రేగా చట్టమే కొనసాగాలని, మోడీ తెచ్చిన అక్రమ చట్టం VB G – RAM G ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలోనే తొలిసారిగా ఆనాడు యూపీఏ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీలోని అనంతపురం జిల్లాలో మొదటగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాటి నుంచి మొన్నటి దాకా కోట్లాది మంది కూలీలకు ఉపాధి కల్పించిందని అన్నారు. కానీ కావాలని మోదీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా, నిధులు ఇవ్వకుండా , రాష్ట్రాలపై భారం పడేలా ఉపాధి హామీ పథకం చట్టాన్ని నీరుగార్చేలా కొత్త చట్టాన్ని తీసుకు వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. దీని కారణంగా పేదలు, కూలీలు, కార్మికులకు బతకడం మరింత బరువుగా మారి పోతుందన్నారు షర్మిలా రెడ్డి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలని ఆమె డిమాండ్ చేశారు.
