అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావించినట్లు సమాచారం. ఇవాళ గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే బీఏసీ, ఆ తర్వాత ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బడ్జెట్ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు నారా లోకేష్. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడిపారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిలిచి పోయిన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్ సీతారామన్ , కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ , రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , మనోహర్ లాల్ ఖట్టర్ , శివరాజ్ సింగ్ చౌహాన్ లను కలుసుకున్నారు. చంద్రబాబు వెంట ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కూడా ఉన్నారు.
