ఆంధ్రప్రదేశ్‌లో రామ రాజ్యం స్థాపించాం

సీఎం నారా చంద్రబాబు నాయుడు

తిరుపతి / ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి సన్నిధిలో నిర్వహించిన శ్రీ సీతా రాముల దివ్య కళ్యాణోత్సవం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయ‌న ముందుగా జై శ్రీరామ్ నినాదాలతో వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన శ్రీ కోదండ రామాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం లభించినట్లు వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. దేవేంద్రుడు పాలించిన దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజల రాజధానిని అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడు, శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద భారీగా తరలి వచ్చిన భక్తజన సమూహం మధ్య జై శ్రీరామ్ నినాదాలు మార్మోగగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండ‌గా సీఎం , త‌న కుటుంబీకుల‌తో క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

Leave A Reply

Your Email Id will not be published!