శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మ వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. 12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారని పేర్కొంది.
ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వరకు శ్రీ భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. 20వ తేదీన రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారని తెలిపింది టీటీడీ. ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వరకు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్సవం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. 23న శ్రీ భాష్యకార్లవారి గంథపుపొడి ఉత్సవం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం ఉంటుందని , 28 నుండి 30వ తేదీ వరకు శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ పాలక మండలి సంయుక్త కార్యనిర్వహణ అధికారి వి.వీరబ్రహ్మం వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
