గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పెరిగిన హోదా
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిపాలనా పరంగా మరింత ఫోకస్ పెట్టారు. ఈ మేరకు భారీ ఎత్తున నిధులను కేటాయించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 100 రోజుల నీటి సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇదిలా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శాసన సభ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఒక్కో అడుగు వడివడిగా వేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయించారు. మున్సిపాలిటీ హోదాతో గొల్లప్రోలు ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా పట్టణ పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. గ్రూప్ 2 స్థాయి అధికారి మున్సిపల్ కమిషర్ గా వస్తారు. మరింత మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుంది. మున్సిపల్ హోదా పెరిగినా ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదని ఈ సందర్బంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ .
