ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. బుధవారం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఆర్బిఐ రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తటస్థ వైఖరిని కొనసాగించేందుకే బోర్డు మొగ్గు చూపిందన్నారు. ఇవాళ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. పాలసీ రెపో రేటు 5.25 శాతంగా యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర బ్యాంక్ తటస్థ ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తుందని ప్రకటించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి ద్రవ్య విధాన సమీక్షలో ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు వంటి అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా సంఘర్షణలో తాత్కాలిక కాల్పుల విరమణను ఈ రోజు ప్రారంభంలోనే ప్రకటించినట్లు సంజయ్ మల్ హోత్రా పేర్కొన్నారు.
కాగా ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ, పశ్చిమ ఆసియా సంక్షోభం తీవ్రతరం కావడానికి ముందు ఉన్న బలమైన వృద్ధి, సాపేక్షంగా తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా భారతదేశ స్థూల ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆర్బీఐ గవర్నర్. ఇదిలా ఉండగా రాబోయే రోజులలో రెపో రేట్ తగ్గించే ప్రమాదం లేక పోలేదని వ్యాపార, వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.
