అమరావతి : ఏపీ విద్యా శాఖ ఈసారి అరుదైన రికార్డు నమోదు చేసింది. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తనదైన ముద్ర వేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టాక పెను సవాల్ గా తీసుకున్నారు విద్యా శాఖను. వివాదాలకు కేరాఫ్ గా మారిన ఈ శాఖను ప్రక్షాళన చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా విద్యావ్యవస్థను గాడిలో పెట్టారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంటర్ ఫలితాల రూపంలో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయంటున్నారు పలువురు ప్రముఖులు.
కాగా ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం 77 శాతం ఉత్తీర్ణత సాధించగా రెండవ సంవత్సరంలో 81 శాతం ఫలితాలు రావడం విశేషం. ఇప్పటి వరకూ హైస్కూలు విద్యార్థులకే అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ అమలు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు, మాన్యువల్స్ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి, బోధనకు అంతరాయం లేకుండా చూశారు.
