న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. మంచి పద్దతి కాదన్నారు. మాకకు 66 శాతం ఓట్లు రాక పోవచ్చు. కానీ 100 శాతం మహిళల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. వాళ్లు పండుగ చేసుకుంటున్నారని, దేనికోసమో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు మోదీ. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలతో సహా ప్రతిపక్షాల స్వార్థ రాజకీయాలు మహిళల హక్కులను హరించి వేయడంలో కీలక పాత్ర పోషించాయని ఆరోపించారు.
మహిళా కోటా చట్టాన్ని, మరో రెండు బిల్లులను సవరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. దేశంలోని మహిళల హక్కులను కాలరాస్తూ కేవలం తమ స్వప్రయోజనాల కోసం పనిచేసే అవకాశవాదుల గుంపుగా నరేంద్ర మోదీ ప్రతిపక్షాన్ని అభివర్ణించారు. లోక్సభలో మహిళా కోటా సవరణ చట్టాన్ని, మరో రెండు బిల్లులను ఆమోదింప జేయడంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) విఫలమైన ఒక రోజు తర్వాత ఈ రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము దేశం కోసం పని చేస్తామని, కానీ విపక్షాలు జాతిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు.
