హైదరాబాద్ : భారత దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామి నాథన్ చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి – భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఉపకులపతి డాక్టర్ సి.హెచ్.శ్రీనివాసరావుకు ప్రొఫెసర్ స్వామినాథన్ పురస్కారం అంద జేశారు. తనకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు. భారత వ్యవసాయ రంగానికి శ్రీనివాసరావు చేసిన విశేష కృషికి ఈ పురస్కారం తగిన గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు శ్రీ స్వామినాథన్ అప్పటి ప్రధాని అటల్ జీ భాగస్వామ్యం అన్నదాతల సంక్షేమం, సాధికారిత కోసం చేసిన కృషి మరవలేనిదని అన్నారు .
రైతులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఉప రాష్ట్రపతి. ఏ నేలలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి? ఏ మొక్కకు ఎంత నీరు కావాలి? లాంటి విషయాలను సెన్సార్లు, ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా తెలుసుకుని తదనుగుణంగా సాగు చేసే పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుందన్నారు వెంకయ్య నాయుడు. ఎం.ఎస్. స్వామినాథన్ కృషితో మనం ఆహార భధ్రత సాధించాం అన్నారు . రానున్న రోజుల్లో ఆర్థిక సుసంపన్నత వైపు అడుగులు వేయడంతో పాటు పోషకాహార భద్రత సాధించాలన్నారు. దానికి అనుగుణంగా మన శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
