విశాఖపట్నం జిల్లా : రాష్ట్రంలో అగ్ని మాపక సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖ ఆర్కే బీచ్లో జరిగిన ‘జాతీయ అగ్నిమాపక వారోత్సవాల’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మెగా ఫైర్ సర్వీస్ డెమోను తిలకించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను, ఆస్తులను కాపాడే అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. హుద్ హుద్ సమయంలో, విజయవాడ వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది శ్రమించిన తీరు ప్రజలు మర్చి పోలేరన్నారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి వివరించడం అద్భుతమన్నారు మంత్రి అనిత వంగలపూడి.
2019 నుండి 2024 వరకు అగ్నిమాపక శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా, మా ప్రభుత్వం ఈ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూ. 232 కోట్ల నిధులతో అత్యాధునిక ఫైర్ వెహికల్స్ను కొనుగోలు చేసిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించిన ఈ ఆధునిక వాహనాలు, డ్రోన్ టెక్నాలజీతో అగ్నిమాపక శాఖకు సరికొత్త శక్తిని ఇచ్చాయన్నారు. అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు అనిత వంగలపూడి. వారోత్సవాల్లోభాగంగా ఫైర్ సేఫ్టీ ప్రామాణికాలు పాటించిన వివిధ విభాగాలు వారిని సత్కరించు కోవడం జరిగిందన్నారు.
