అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నీటి పారుదల రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఒక బాధ్యత కలిగిన మాజీ సీఎంగా అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు. ఎంత సేపు నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పితే తనకు రాష్ట్రం పట్ల మక్కువ ఏ మాత్రం లేదన్నారు. ఇక నుంచైనా బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో ఒక వైపు సంక్షేమంతో పాటు అభివృద్దిని సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు విస్తృతంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, రాయలసీమకు తాగు, సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు.
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదేనన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గత ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రులకు పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదంటూ ఎద్దేవా చేశారు. అటువంటి వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాద్యత కూటమి నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలన్నారు.ఇక నుంచైనా జగన్ రెడ్డి మారాలని జనం కోరుకుంటున్నారని కానీ ఆయన తన తీరు మార్చు కోవడం లేదంటూ మండిపడ్డారు. గత ఎన్నికల్లో జనం నేలకేసి కొట్టారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ది తెచ్చుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
