ముంబై : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఓటమి దక్కింది. ఐపీఎల్ 2026లో భాగంగా స్వంత గడ్డపై జరిగిన కీలక పోరులో పేలవమైన ఆటతీరుతో చేతులెత్తేసింది. ఇక టోర్నీలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఆజట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. మరో వైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జోరు కొనసాగిస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలర్ల ధాటికి విల విల లాడారు ముంబై బ్యాటర్లు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ముంబై ఇండియన్స్ ను ఏకంగా 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. యంగ్ క్రికెటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బంతులు ఎదుర్కొన్నాడు. 80 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ షో చేశాడు. తను కేవలం 35 బాల్స్ ఆడి 66 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన క్వింటన్ డికాక్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తను 60 బంతుల్లో సూపర్ సెంచరీ చేశాడు. 112 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి. తను సెంచరీ బాదడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. ఇక డికాక్ తో పాటు నమన్ ధీర్ రెచ్చి పోయాడు. 31 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి.
