Srirangam Srinivasarao : శ్రీ శ్రీ రచయిత

మహాప్రస్థానం రచయిత శ్రీశ్రీ జీవిత విశేషాలు

Srirangam Srinivasarao : శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 – జూన్ 15, 1983): విప్లవ రచయితగా, అభ్యుదయ వాదిగా, సినీ రచయితగా, ప్రముఖ జర్నలిస్టుగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా… తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన అతికొద్ది మంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు.

Srirangam Srinivasarao – శ్రీశ్రీ రచనా ప్రస్థానం

శ్రీశ్రీ తన ఏడవ యేటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించగా … తన ఎనిమిదవ యేట మొదటి గేయాల పుస్తకం ప్రచురింపబడింది. 18వ యేట (1928)లో తన మొదటి పద్యకావ్యం “ప్రభవ” ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం వల్ల నిరుద్యోగులైన యువకుల జీవితాలు మొదలుకొని చిరుద్యోగుల జీవితాలు అల్లకల్లోలమై హంగ్రీ థర్టీస్ గా పిలువబడిన 1930 దశకంలో…. అంటే 1934 నుంచి 1940 వరకూ తాను రాసిన కవితల్లోని ఉత్తమమైన, మానవజాతి ఎదుర్కొంటున్న బాధల గురించి, క్రొత్తగా వెలువడాల్సిన సాహిత్యం గురించి వ్రాసిన కవితలతో ఓ కవితా సంకలనం ప్రచురించారు. 1950లో “మహాప్రస్థానం” పేరిట ప్రచురించిన ఈ కవితా సంకలనం అత్యున్నత స్థానంలో నిలిచి ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీని(Srirangam Srinivasarao) మహాకవి చేసింది. తరువాత ఖడ్గ సృష్టి, మరోప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి, గర్జించు రష్యా మొదలైన రచనలు మార్క్సిజం దృక్పథంతో సామాజిక వాస్తవికతను స్పృశించిన రచనల్లో ముఖ్యమైనవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను శ్రీశ్రీ సొంతం చేసుకున్నారు.

సినిమా రంగంలో శ్రీశ్రీ పాత్ర

శ్రీశ్రీ సినీ గేయ, మాటల రచయితగానే కాకుండా “చెవిలో రహస్యం” అనే డబ్బింగ్ సినిమాకు నిర్మాతగా గా కూడా పనిచేసారు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన “తెలుగు వీర లేవరా” అనేది నేటికీ కూడా ఆణిముత్యమే. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి శ్రీశ్రీ ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగా ఉన్న శ్రీశ్రీ…. 1970లో విశాఖలో నిర్వహించిన తన షష్ఠిపూర్తి మహోత్సవం వేదికగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పాటు చేసారు. ఆ తరువాత కొంతకాలానికి క్యాన్సరు వ్యాధి బారిన పడి 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించారు. శ్రీశ్రీ నలుగురి సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు మాలా 2022లో మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితమయ్యారు.

కార్మిక, కర్షకలోకంలో మహాప్రస్థానం స్థానం

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!
అంటూ….. శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం నేటికి కూడా కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తుంది.

Also Read : Gurajada Apparao : మహాకవి జీవిత విశేషాలు

Leave A Reply

Your Email Id will not be published!