టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

కోట్లాది భ‌క్తుల ఆక‌లి తీరుస్తున్న వైనం

హైద‌రాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం ప్ర‌త్యేకంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిత్య అన్న‌దానం ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో వెంగ‌మాంబ అన్న‌దానం స‌త్రం ద్వారా ఆక‌లిని తీరుస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి , దివంగ‌త నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తలకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది.

భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తోంది. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చి స‌హ‌కారం అందిస్తున్నారు దాత‌లు, మాన‌వ‌తావాదులు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి రోజు లక్ష మందికి పైగా భ‌క్తులు భోజ‌నం చేస్తున్నారు. ఒక రోజుకు దాదాపు రూ. 30 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చు అవుతోంది. ఈ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి దాత‌లు, భ‌క్తులు రూ. 1000 నుంచి రూ. కోటి దాకా ఇవ్వ‌వ‌చ్చు.

Leave A Reply

Your Email Id will not be published!