హైదరాబాద్ : తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రత్యేకంగా దర్యాప్తు బృందం (సిట్ )ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా పలువురిని విచారించింది. గత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాను పలువురు ప్రముఖులను విచారించింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ తో పాటు చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టేందుకు గాను గురువారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొంది సిట్.
ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో తనకు కూడా సమన్లు పంపింది. మాజీ ఎమ్మెల్యేలను ఉదయం హాజరు కావాలని కోరగా కొండల్ రెడ్డిని మధ్యాహ్నం 3.27 గంటలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తాను ఆరోపించిన అక్రమ నిఘాపై దర్యాప్తు కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయం తెలిసింది. దర్యాప్తులో ఉన్న నిఘా ఆపరేషన్లో భాగంగా ఆయన ఫోన్ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనేది ఈ కేసులో ప్రధానంగా ఆరోపణ.
