హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేట సర్వే నంబరు 44లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇదే సర్వే నంబరు 44లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతోందని హైడ్రాకు గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గతేడాది డిసెంబరు 8వ తేదీన 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను తొలగించింది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని 200ల మీటర్ల మేర ఉన్న 18 షెట్టర్లను హైడ్రా గతంలోనే తొలగించింది.
తాజాగా అదే సర్వే నంబరు 44లో 15 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. రేకులతో హద్దులను నిర్ణయించి ఆక్రమణలకు పాల్పడగా.. వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. సర్వే నంబరు 44లోని ప్రభుత్వ భూమిలో అక్రమ రిజిస్ర్టేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కు సంబంధించిన వార్తల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు 15 ఎకరాల మేర ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. 159 సర్వే నంబర్కు సంబంధించిన పత్రాలతో సర్వే నంబర్ 44 లోని ఎకరన్నర వరకూ కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదయ్యింది.
