పార‌ద‌ర్శ‌కంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు

ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైసీపీ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని తెలిపింది.
ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయ‌ని, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వతో ఖరీఫ్ ను విజయవంతంగా ముగించామ‌న్నారు. రబీ 2025-26 పంటకాల అవసరాలకు అనుగుణంగా 9.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయింపులు పొందామ‌న్నారు. సీఎం చంద్ర‌బాబు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖతో నిరంతర చర్చలు జరుపుతూ, రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలు సమయానుగుణంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింద‌ని చెప్పారు అచ్చెన్నాయుడు.

ఇప్పటి వరకు 10.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రంలో అందుబాటులో ఉంచామ‌న్నారు. ఫిబ్రవరి మాసాంతానికే రాష్ట్రంలోని రైతుల యూరియా అవసరాలను పూర్తిగా తీర్చడం జ‌రిగింద‌న్నారు. కేటాయించిన యూరియాను జిల్లాల వారీగా, గత మూడు సంవత్సరాల వినియోగ సరళిని ఆధారంగా తీసుకొని ప్రణాళికాబద్ధంగా సరఫరా చేశామన్నారు. ప్రతి పది రోజులకొకసారి పంటల పురోగతిని సమీక్షిస్తూ, రాబోయే 21 రోజులకు సరిపడా యూరియాను జిల్లాలలో ముందస్తుగా అందుబాటులో ఉంచడం ద్వారా రబీ పంటకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా నిర్వహించగలిగామ‌ని వెల్ల‌డించారు.

అక్రమ వ్యాపారస్తులపై తక్షణ చర్యలు తీసుకోవడం, అధిక ధరలకు విక్రయించే వర్తకుల లైసెన్సులు రద్దు చేయడం, యూరియాను ఇతర అవసరాలకు మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సరఫరాను సజావుగా కొనసాగించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. ప్రతి సంవత్సరం బఫర్ స్టాక్ నిర్వహణకు కేటాయించే రూ. 40 కోట్లకు అదనంగా, 2025-26 సంవత్సరానికి రైతుల అవసరాల నిమిత్తం మరొక రూ. 45 కోట్లు అదనంగా కేటాయించిన‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!