ఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏఐ టెక్నాల‌జీ వినియోగించ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఏఐ టెక్నాలజీ వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. దీనికి తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యనే నిదర్శనమని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ, నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని, దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. ఇప్పుడు కొండపై ప్రసాదం బావుంది, దర్శనం బావుంది, శ్రీవారి సేవకులు, భక్తుల్లో సంతృప్తి పెరిగిందని అన్నారు సీఎం. అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా తిరుమల ప్రసాదాల్లో న్యుట్రిషనల్ విలువలు, పదార్ధాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని, దీంతో భవిష్యత్‌లో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం అన్నారు.

ఇదే తరహాలో మిగిలిన శాఖలు మెరుగైన ప్రజా సేవలకు ఏఐ ఇంటిగ్రేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఐఓటీ పరికరాలు, సెన్సార్లు, సీసీ టీవీ లాంటి వివరాలతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి, ఉత్పత్తి పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగంపైనా అధ్యయనం జరపాలన్నారు. రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ పెంచేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ శాఖలు అవేర్‌, డేటా వినియోగం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించేలా చూడటం కీలకమన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కొలుసు పార్థ సారధి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!