శాన్ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా): అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘M4M (మోటివ్ ఫర్ మర్డర్)’ మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మతో కలిసి ‘M4M-2’ సీక్వెల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎం4ఎం అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, విశిష్ట అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత మోహన్ వడపట్ల మాట్లాడారు. M4M విజయానికి ప్రేక్షకుల అపారమైన ఆదరణే ప్రధాన కారణమని అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా అందించిన సహకారం లేకుండా ఈ విజయాన్ని సాధించడం సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తమకు మరింత బాధ్యతను పెంచాయని, అదే ఉత్సాహంతో M4M-2ను మరింత ఉన్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నామని ప్రకటించారు. మోహన్ వడపట్ల , జో శర్మ కలిసి సీక్వెల్ కు సంబంధించిన విశేషాలు వెల్లడించారు. తొలి భాగాన్ని మించిన ఉత్కంఠ, మరిన్ని ఊహించని మలుపులు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందే భారీ సైకాలజికల్ థ్రిల్లర్గా M4M-2 ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
మొదటి భాగంలో తన నటనతో ప్రశంసలు అందుకున్న ఈచిత్ర హీరోయిన్ జో శర్మ. ప్రేక్షకులు చూపించిన ఆదరణకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీక్వెల్లో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నానని, ప్రేక్షకులకు మరోసారి థ్రిల్లింగ్ సినీ అనుభూతిని అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.
