న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు ప్రతిపాదనలు అందజేశారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల అభివృద్ధి, విస్తరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా మంత్రి చేసిన ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు సెక్రటరీ.
ఇదిలా ఉండగా కార్యదర్శిని కలిసిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి కోరడం జరిగిందన్నారు. అనంతరం ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తోందన్నారు.
