అమెరికా : ఇరాన్ పై యుద్దం కొనసాగుతున్న వేళ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా యుఎస్ ఆర్మీ చీఫ్ కు ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా దేశ అత్యున్నత సైనికాధిపతికి ఉద్వాసన పలికారు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్తో భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో కారణం చెప్పకుండా ఓ సైన్యాధ్యక్షుడ్ని తొలగించారంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్మీచీఫ్ స్థానంలో తమకు విధేయుడైన వ్యక్తి రాబోతున్నారు. అంటే గత సైన్యాధ్యక్షుడు అడ్డు చెప్పిన నిర్ణయాల్ని అమలు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ఉన్నతాధికారులను తొలగించారు. సైన్యంలో శరవేగంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే వచ్చే 2 వారాలు యుద్ధం మరింత తీవ్రం కాబోతోందని స్పష్టం అవుతోంది. ఇరాన్ యుద్ధ సంక్షోభం మధ్య ఆర్మీ చీఫ్ను తొలగించడం చర్చకు దారితీసేలా చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి వైదొలగమని కోరడంతో, అమెరికా రక్షణ శాఖ ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్ను తొలగించింది. ఈ చర్య అమల్లో ఉన్నంత వరకు క్రిస్టోఫర్ లానెవ్ను తాత్కాలిక చీఫ్గా నియమించారు. ఇదిలా ఉండగా జనరల్ రాండీ ఎ. జార్జ్ 41వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయనున్నారంటూ పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
