చెన్నై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో ఆరంభంలో నిరాశ పరిచిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మెల మెల్లగా తర్వాతి మ్యాచ్ లలో పుంజుకుంది. మొదటగా తడబడిన సీఎస్కే ఆ తర్వాత పుంజుకుంది. టోర్నీలో అత్యంత బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ పై సూపర్ షో చేసింది. గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తొలి మూడు మ్యాచ్ లలో వరుసగా విఫలమైంది సీఎస్కే. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. తనను ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్లకు తీసుకుంది. ఇది అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. మరో వైపు చెన్నైకి ఆయువుపట్టుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నట్టుండి సంజు శాంసన్ వైపు మొగ్గు చూపడం విస్తు పోయేలా చేసింది.
కానీ ఆశించిన మేర రాణించలేదు శాంసన్. వరుసగా మూడు మ్యాచ్ లలో 9, 6, 7 రన్స్ మాత్రమే చేశాడు. ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో రెచ్చి పోయాడు తన సత్తా ఏమిటో చూపించాడు. ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. అజేయంగా 115 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తాజాగా మాజీ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 192 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మరోసారి కెప్టెన్ రుతురాజ్ విఫలం అయినా ఎక్కడా తగ్గలేదు సంజూ శాంసన్ , ఆయుష్ మాత్రే. ఇద్దరూ కలిసి దుమ్ము రేపారు. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది కేకేఆర్ కు.
