ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.
ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఈసారి ఒంటిమిట్టలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ధ్వజారోహణంతో ముగిశాయి. ఈ సందర్బంగా చేపట్టిన శ్రీ కోదండ రాముడి కళ్యాణోత్సవానికి రికార్డు స్తాయిలో భక్తులు హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు, కుటుంబీకులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు సదాశివ రావు, డిప్యూటీ ఈవో ప్రశాంతి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
