శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగతి పనులను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మూలాపేట పోర్టు పనులను పరిశీలించారు. అనంతరం పోర్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు పనులను పూర్తి చేసి ఆపరేషన్లు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందన్నారు. పోర్టు నిర్మాణంలో పెండింగ్ సమస్యలు ఇంకా ఇతర సమస్యలు పై కూడా చర్చించామన్నారు. ఎప్పటిలోపు పనులు పూర్తిగా పూర్తవుతాయని ఆరా తీశామన్నారు. దాదాపు రూ. 4361.91 కోట్లతో చేపట్టిన మూలాపేట పోర్టు పనుల్లోఫేజ్ 1 లో 1524 ఎకరాల్లో 4 బెర్త్ ల నిర్మాణం చేపట్టాం అన్నారు.
తొలుత 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ. భూ సేకరణ వంటి అనివార్య కారణాలతో 2026 నవంబర్ నాటికి పోర్టును ప్రారంభించాలన్న దృఢ నిశ్చయంతో పని చేస్తున్నాం అన్నారు బీసీ జనార్దన్ రెడ్డి , అచ్చెన్నాయుడు. మూలాపేట పోర్టు ఉత్తరాంధ్రలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉందన్నారు. ఈ పోర్టు నిర్మాణంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తీర ప్రాంతం లేని, సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్..దక్షిణ ఒడిస్సా ప్రాంతాలకు ఇది అత్యంత అందుబాటులో ఉండే పోర్టు కావడం కలిసొచ్చే అంశం అని చెప్పారు. మూలపేట పోర్టుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలకు వాస్తవాలు తెలియ జేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
