Kaveri Travels: కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం

కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం

Kaveri Travels : కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ… వీ కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) యాజమాన్యం స్పందించింది. బస్సుకు ఫిట్‌నెస్‌ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు వ్యాలిడ్‌లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.

‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్‌ డోర్‌ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్‌లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది.

అయితే… ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్‌ (Kaveri Travels) యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్‌ బాటిల్‌ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు.

మరోపక్క… ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైక్‌ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. కనీసం డోర్‌ తెరిచినా.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, బైకర్‌ కలిపి ఇప్పటిదాకా 20 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

Kaveri Travels – కర్నూలు బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలు – సీఎం చంద్రబాబు

కర్నూలు (Kurnool) బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్‌, సేఫ్టీ, పర్మిట్‌ తనిఖీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌, పర్మిట్‌ వివరాలపై పూర్తి నివేదికను కోరారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి – పవన్‌ కల్యాణ్‌

కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read : Minister Kolusu Parthasarathi: బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు – మంత్రి పార్థసారథి 

Leave A Reply

Your Email Id will not be published!