ఖరగ్పూర్-అమరావతి హైవేకు ఆమోదం సీఎం సంతోషం
ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలకు థ్యాంక్స్
అమరావతి : కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కార్ తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఖరగ్ పూర్ అమరావతి మధ్య హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. హైవే ప్రకటించినందుకు దేశ ప్రధాని మోదీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీలకు ధన్యవాదాలు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 32,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ దక్షిణ రాష్ట్రం గుండా 457 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. 1,107 కిలోమీటర్ల పొడవైన ఖరగ్పూర్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేకు ఆమోదం లభించడం పట్ల చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు సీఎం.
ఈ కీలక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ , తూర్పు భారతదేశం మధ్య అనుసంధానాన్ని ఏర్పరుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1,107 కిలోమీటర్ల ఖరగ్పూర్-అమ రావతి కారిడార్కు ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మరోసారి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్ రైతులు , పరిశ్రమలకు రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులను తగ్గించి, గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేస్తుందని చెప్పారు. అంతే కాకుండా ఇది వాణిజ్యం, వ్యవసాయం, తయారీ , ఉపాధి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా నిర్మిస్తున్నట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
