చెన్నై : ఎవరూ ఊహించని రీతిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉన్నట్టుండి తమిళనాడులో ప్రత్యక్షం అయ్యారు. ఆయన నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా ఆర్బిఐ గవర్నర్లు ముఖ్యమంత్రులను కలుస్తూ ఉంటారు, కానీ తరచుగా కాదు. ఈ సమావేశాలు సాధారణంగా అధికారిక పర్యటనల సమయంలో లేదా బ్యాంకింగ్, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, రుణ వృద్ధి, ఆర్థిక సమ్మిళితం , అభివృద్ధికి సంబంధించిన చర్చల సందర్భంగా జరుగుతాయి. అందుకే సిఎం విజయ్తో సంజయ్ మల్హోత్రా సమావేశం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.
తమిళనాడు ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వాల నుండి వారసత్వంగా వచ్చిన ఆర్థిక భారం గురించి సిఎం విజయ్ పదేపదే మాట్లాడారు..అవసరమైన ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. విజయ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉంది. తమిళనాడ రాష్ట్రానికి సంబంధించిన రుణాలు, ఆర్థిక పరిస్థితి, రుణ ప్రవాహాలు, మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ , విస్తృత అభివృద్ధి ప్రాధాన్యతల వంటి అంశాలపై చర్చలు జరిగాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మల్హోత్రా నేపథ్యం. ఆయన ఒక వృత్తిపరమైన అధికారి, గతంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మంచి పని సంబంధాలను కొనసాగిస్తున్నారు.
సీఎం విజయ్ ఆర్బిఐ గవర్నర్ను కలవడం అనేది పరిపాలన పట్ల ఆయనకున్న ఆచరణాత్మక దృక్పథానికి మరో సంకేతం. ఆయన ఢిల్లీతో ప్రతి సంభాషణను రాజకీయ ఘర్షణగా మార్చకుండా, కీలక జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీతో ఉన్న రాజకీయ, సైద్ధాంతిక విభేదాలు తమిళనాడుకు ఆర్థిక అవరోధాలుగా మారనవసరం లేదు. సీఎం విజయ్ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నారు, దీనివల్ల తమిళనాడు లబ్ధి పొందుతుందని అనడంలో సందేహం లేదు.
