తిరుపతి : తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆలయం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగో రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై శ్రీ కోదండ రామస్వామి వారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
సర్వ భూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింప జేసే వారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవోనాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, హరికృష్ణ, ఆర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగిందని తెలిపారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం.
మరో వైపు మార్చి 28 నుంచి ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. తాజాగా భక్తుల ఆకలిని తీర్చేందుకు నిత్య అన్నదానం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
