Maoist Asanna: మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

Maoist Asanna: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత ఆశన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌ ఎదుట లొంగిపోయాడు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్‌… మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న (Maoist Asanna) అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతోపాటు 130 మంది లొంగిపోయారు. ఆశన్నతోపాటు (Maoist Asanna) 130 మంది మావోయిస్టులను బీజాపూర్ పోలీసులు బస్సులో తరలించారు. ఈ క్రమంలో లొంగిపోయిన నక్సలైట్లందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అగ్రనేతలు కూడా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముగించి.. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.

Maoist Asanna – లొంగిపోయే ముందు మావోయిస్టు ఆగ్రనేత ఆశన్న భావోద్వేగ సందేశం

లొంగిపోయే ముందు మావోయిస్టు అగ్రనేత ఆశన్న (Maoist Asanna) అలియాస్‌ రూపేష్‌ తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నాం. మా సహచరుల్లో కొంత మంది ఇంకా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నారు. కానీ, మనం సొంత భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని వారు అర్థం చేసుకోవాలి. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరం. హింసా మార్గాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అడవుల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే నన్ను సంప్రదించాలి’’ అని ఆశన్న (Maoist Asanna) తెలిపారు.

లొంగిపోయేందుకు వస్తున్న మరో 140 మంది మావోయిస్టులు

మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట బుధవారం లొంగిపోగా… అదే బాటలో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న (Maoist Asanna) కూడా ఇవాళ లొంగిపోయారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక నేతలు రూపేష్, రనిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 17న శుక్రవారం జగదల్‌పూర్‌లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట లొంగిపోనున్నారు.

కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి భైరామ్‌గఢ్ వైపు వెళుతున్నారు. వారు ఇంద్రావతి నది అవతలి వైపుకు చేరుకుంటారు. నక్సలైట్లందరూ లొంగిపోవడానికి 70కి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. భైరామ్‌గఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఈ నదిని దాటి జగదల్‌పూర్‌కు చేరుకుంటున్నారు. ఉస్పారి ఘాట్ మార్గంలో బయటి వ్యక్తులెవరినీ ప్రయాణించడానికి అనుమతించడం లేదు.

రూపేష్… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ మావోయిస్టు నేత. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) లోని మాడ్ డివిజన్‌లో లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర కమిటీ మరియు స్థానిక జోనల్ నిర్మాణం మధ్య సంబంధాల వారధిగా పనిచేశారు. రనిత.. DKZC మాడ్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన సీనియర్ మహిళా కమాండర్. బస్తర్ జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్‌లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లొంగుపోక తప్పడం లేదు. కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న వందల సంఖ్యలో మావోయిస్టులు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. గత రెండు రోజులుగా అగ్రనేతలతో సహా 283 మంది మావోయిస్టులు తాము చేతపట్టిన తుపాకులను, నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమవుతున్నారు.

నక్సలిజంపై అమిత్ షా సంచలన ప్రకటన..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. ఆ దిశగా గత కొన్ని నెలల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా దళాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విజృంభిస్తున్నాయి. నక్సల్స్‌ను ఏరిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నక్సలైట్లు ప్రాణ భయంతో లొంగిపోతున్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న కీలక నేతలు సైతం లొంగిపోతున్నారు. గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో 258 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో … ‘నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది కీలకమైన రోజు. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు.

నిన్న 27 మంది లొంగిపోయారు. నిన్న మహారాష్ట్రలో 61 మంది నక్సలైట్లు లొంగిపోయారు. కేవలం రెండు రోజుల్లోనే 258 మంది నక్సలైట్లు హింసను వదిలిపెట్టేశారు. నేను వారి నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి కారణంగా నక్సలిజం అంతం అవ్వబోతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా లొంగిపోవాలని అనుకుంటే వారిని స్వాగతిస్తాము. లేదు గన్నులే పట్టుకుంటాము అంటే మా దళాల దమ్మును ఎదుర్కోండి. నేను మరో సారి విన్నవిస్తున్నా.. ఇప్పటికైనా నక్సలిజాన్ని వదిలేసేయండి. 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాము’ అని అన్నారు.

Also Read : Kiran Majumdar Shaw: చెత్తపై కిరణ్‌ మజుందార్ షా చేసిన పోస్టు వైరల్‌

Leave A Reply

Your Email Id will not be published!