అమరావతి/ విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సింగపూర్ దేశ ప్రతినిధులతో విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో గ్లోబల్ కనెక్టివిటీ, ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై విస్తృతంగా చర్చించారు. సింగపూర్ దేశం తన అవసరాల కోసం సుమారు 80 శాతం ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, ఆ దేశం అనుసరిస్తున్న ఆహార భద్రతా విధానాలు, నిల్వ పద్ధతులు, సరఫరా అనుబంధాల నిర్వహణపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల సంరక్షణ చర్యలు, సమయానికి సరఫరా, సమర్థవంతమైన రవాణా నిర్వహణపై సింగపూర్ ప్రతినిధులు అమలు చేస్తున్న విధానాలను వారు వివరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ఎగుమతుల పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. రైతులకు లాభసాటి ధరలు అందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియ జేశారు. పబ్లిక్ పాలసీల రూపకల్పనలో సాధారణ ప్రజల అభిప్రాయాలను ఎలా సేకరిస్తారు, వాటిని ఎలా అమలు చేస్తారు అనే అంశంపై ఇరు పక్షాల మధ్య చర్చ జరిగింది. సింగపూర్ ప్రతినిధులు డేటా అనలిసిస్, యుటిలైజేషన్ ద్వారా పాలసీలను ఎలా రూపొందిస్తారో వివరించారు. ఈ విధానాలను రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశాలపై మంత్రి ఆసక్తి వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంత అభివృద్ధి, తీర ప్రాంత వ్యవసాయం, మత్స్య రంగానికి సంబంధించిన అవకాశాలు, తీర ప్రాంత మౌలిక సదుపాయాల పెంపు వంటి అంశాలపై కూడా చర్చించారు.
