అమరావతి : బీసీల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ విశేష కృషి చేశారన్నారు మంత్రులు ఎస్. సవిత, కొలుసు పార్థసారథి. ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం పాటు పడిన అరుదైన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. బీసీలకు సీఎం వెన్నుదన్నుగా నిలిచారన్నారు. జగన్ హయాంలో బీసీల హక్కులు భూ స్థాపితమయ్యాయన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి శభాష్ అనిపించుకున్న మంత్రి నారా లోకేశ్ త్వరలో మరో డీఎస్సీ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారన్నారు. మహిళల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
దీపం 2, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలుచేసి, మహిళా పక్షపాతినని సీఎం చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని ప్రశంసలు కురిపించారు మంత్రులు ఎస. సవిత, పార్థసారథి. జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని మండిపడ్డారు. అంతకు ముందు నూజివీడుకు వచ్చిన మంత్రి సవితకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ ర్యాలీ నిర్వహించి, గజమాలతో సత్కరించి అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి. మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి స్వాతంత్ర సమర యోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఈశ్వరరావు, డైరెక్టర్లు, ఉమ్మడి కృష్ణా జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
