ప్రోటోకాల్ ఉల్లంఘన సీఎంగా కొలువు తీరిన సతీషన్
వేదికపై మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ , ఖర్గే
తిరువనంతపురం : కేరళం ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు వీడీ సతీషన్. కేరళంలో యుడీఎఫ్ ఆధ్వర్యంలో భారీ మెజారిటీ సాధించినప్పటికీ సీఎంగా అభ్యర్థిని ఖరారు చేయడంలో తాత్సారం చేసింది ఏఐసీసీ. సీఎం పోస్టు కోసం వీడీ సతీషన్ తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీపడ్డారు. చివరకు అధిష్టానం సతీషన్ వైపు మొగ్గు చూపింది. దీంతో సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం కేవలం ఎన్నికైన వారు మాత్రమే వేదికపై ఉండాలి. కానీ వీటిని కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా కేరళ లోక్ భవన్ జారీ చేసిన ఒక ఆదేశం ప్రకారం వేదికపై గవర్నర్, కాబోయే ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తో పాటు స్వీకారం చేసే మంత్రులు మాత్రమే ఆసీనులు కావాలి. కానీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ నిబంధన పాటించ లేదు. సెంట్రల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, కాబోయే ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి వేదికను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, బీజేపీ నాయకులు రాజీవ్ చంద్రశేఖర్, వి.ఎం. సుధీరన్ వంటి అనేక ప్రముఖ నాయకులకు కూడా వేదికపైనే ఆసనాలు కేటాయించారు.
