Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి
గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి
Rivaba Jadeja : గుజరాత్ లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది. గుజరాత్లోని గాంధీ నగర్ లో నేడు 26 మంది సభ్యుల కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా (Rivaba Jadeja) కూడా ఉన్నారు.
గురువారం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. వ్యవస్థాగత, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళికలో భాగంగా ఈ రాజీనామా ప్రక్రియ చోటుచేసుకున్నట్లు పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 182. నిబంధన ప్రకారం.. మంత్రుల సంఖ్య 27 వరకు ఉండొచ్చు.
Rivaba Jadeja – రివాబా జడేజా ప్రస్థానం
1990లో రాజ్కోట్లో జన్మించిన రివాబా… ఆత్మియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో బీజేపీలో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆమె కమలదళంలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్గా వ్యవహరించారు.
గుజరాత్ లో కొలువు దీరిన నూతన మంత్రివర్గం
గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా (Rivaba Jadeja) కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.
కమలం అధిష్టానం క్యాబినెట్లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు.
Also Read : Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ
