హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు , ప్రత్యేకించి ఖాకీలకు పెను సవాల్ గా మారింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ వ్యవహారం. ఆయనపై ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి తరపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. ఆయన తరపున బీజేపీకి చెందిన మరో పేరు మోసిన లాయర్ రచనా రెడ్డి తాను వాదించ బోనంటూ చెప్పడం విశేషం. ఈ తరుణంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బండి భగీరథ్ కు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు నిలదీస్తున్నారు. పౌర సమాజం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. దీంతో చివరకు సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించాల్సి వచ్చింది. సిట్ వేశామని, అమ్మాయి మైనర్ కావడంతో సున్నితమైన కేసుగా పేర్కొన్నారు. గాలిస్తున్నామని కానీ దొరకడం లేదంటూ పేర్కొన్నారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి బండి కొడుకు ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తన కోసం నాలుగు బృందాలతో వెతుకుతున్నారు. బండి భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ , తదితర ప్రాంతాలలో విస్తృతంగా గాలిస్తున్నారు. తండ్రి సంజయ్ నివాసంలో సోదాలు కూడా చేపట్టారు. కరీంనగర్ లోని భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు డిల్లీలో బీజేపీ నేతల రక్షణలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి గాలింపు చేస్తున్నార పోలీసులు. ఇదిలా ఉంటే పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.. అయితే అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.