హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

అంగ‌రంగ వైభ‌వంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంర‌గంగ వైభ‌వోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు భ‌క్తుల‌కు. గజ రాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. త్రేతా యుగంలో రామ భక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు.

అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండ రాములవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాముల వారు భక్తులకు కనువిందు చేశారు. ఈ కీల‌క వాహ‌న సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రాముని బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి. జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో ప‌ర్య‌వేక్షించారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి నిత్యం విరాళాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళంగా అందించింది . ఈ మేరకు దాత జే.రాజా రమేష్ తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!