హైదరాబాద్ : ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) ఒక ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ప్రకటించారు. ఈ ట్రస్ట్ను రాబోయే రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు, సిఫార్సులను పొందుపరిచిన తర్వాత, ట్రస్ట్ ఏర్పాటు పనితీరుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, క్రమబద్ధీకరించడం కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ సమావేశం దృష్టి సారించిందన్నారు.
ప్రతినిధులను ఉద్దేశించి రామకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తెలంగాణ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండే, నాణ్యమైన, అవాంతరాలు లేని ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతిపాదిత ట్రస్ట్, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను సమర్థవంతంగా ,పారదర్శకంగా అందించడానికి ఒక పటిష్టమైన సంస్థాగత యంత్రాంగంగా పనిచేస్తుందని నొక్కి చెప్పారు.
ట్రస్ట్ కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరుస్తామని, ప్రభుత్వం, ఉద్యోగుల నుండి సమానమైన ఆర్థిక వాటాలతో దీనిని నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా, ఈ ట్రస్ట్ పూర్తి స్వయం ప్రతిపత్తితో పని చేస్తుందని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం దీనికి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి విలువ ఇస్తుందని, సుస్థిరమైన, చురుకైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని రామకృష్ణారావు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ట్రస్ట్ కార్యాచరణ చట్రాన్ని ఖరారు చేసేటప్పుడు, ఉద్యోగుల సంఘాల నుండి అందిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించి, వాటిని పొందుపరుస్తామని ఆయన అన్నారు.
