నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
స్పష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో పారే నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు. రూ.440 కోట్ల విలువైన డయాఫ్రం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ దాని పునర్నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు సీఎం. ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువతో వంశధారను అనుసంధానం చేసి ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేస్తామన్నారు . అటు నల్లమల సాగర్ తోనూ అనుసంధానించి రాయల సీమకూ నీరు తరలిస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
గోదావరి, కృష్ణా నదుల ద్వారా 5 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు .
కేవలం 200 టీఎంసీల వరద నీటిని నల్లమలసాగర్ కు తరలించి కరవును తరిమికొట్టాలన్నదే మా ప్రయత్నం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసినా మనం అభ్యంతరం చెప్ప లేదన్నారు. మన తెలుగు సోదరులే అక్కడా ఉన్నారని, మనవాళ్లే నీళ్లు వినియోగించుకుంటే అందరికీ సంతోషమేనని అన్నారు. వారు నీళ్లు వినియోగించుకున్నా ఏపీకి అభ్యంతరం లేదన్నారు. ఏపీలో ఉన్న జలాశయాలు, గొలుసు కట్టు చెరువులు అన్నీ నింపి మన రైతులకు, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. కరవును తరిమి కొట్టేలా కార్యాచరణ చేపడుతున్నాం అని, దానికి సాగునీటి సంఘాల ప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు.
