హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 8వ తేదీన కేసు నమోదు కాగా ఇప్పటి వరకు తను దొరకకుండా, తప్పించుకు తిరిగాడు. ఇది హై ప్రొఫైల్ కేసు అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. చివరకు మీరు ఎవరి వైపు ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు రావడంతో గత్యంతరం లేక తనను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ తాము అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నా తనంతకు తానే ఇక అన్ని దారులు మూసి పోయాక ముఖానికి మాక్స్ వేసుకుని పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించి భగీరథ్ అంశం కలకలం రేపింది. ఒక మైనర్ బాలికను రేప్ చేసిన అంశం సంచలనంగా మారింది.
ఇక కేసు విషయానికి వస్తే పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, Cr. No. 684/2026 కింద, BNS సెక్షన్లు 64 (2)(m), 74, 75 మరియు POCSO చట్టం 2012లోని సెక్షన్ 5 (1) r/w 6 ప్రకారం నమోదు చేశారు. బాధితురాలైన బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 8వ తేదీన బండి సాయి భగీరథ్ అలియాస్ భగీరథ్ పై ఒక కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. దర్యాప్తు క్రమంలో, దర్యాప్తు అధికారి (IO) బాధితురాలి ,ఇతర సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, కేసులో వర్తించే చట్టపరమైన సెక్షన్లను సవరించి, BNS సెక్షన్ 64 (2) (m) , POCSO చట్టంలోని సెక్షన్ 5 (1) r/w 6 లను అదనంగా చేర్చారు. ఈ దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా కూకట్పల్లి DCP రితిరాజ్కు ఆదేశాలు జారీ చేశారు సీఎం. అలాగే, దర్యాప్తు అధికారి బాధితురాలి వాంగ్మూలాన్ని BNSS సెక్షన్ 183 కింద మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయించారు.
నిందితుడిని పట్టుకోవడానికి విస్తృత ప్రయత్నాలు జరిగాయని తెలిపారు సీపీ. ఇందులో భాగంగా కరీంనగర్, ఢిల్లీ , ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపారు. నిందితుడు తరచుగా సంచరించే వివిధ ప్రదేశాలలో, అతని పరిచయస్తుల ఇళ్లతో సహా పలు చోట్ల ఈ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దర్యాప్తు అధికారి నిందితుడి కోసం ఒక ‘లుక్ అవుట్ సర్క్యులర్’ (Look out Circular)ను కూడా జారీ చేశారు. నిందితుడు పోలీస్ అకాడమీ సమీపంలో సంచరిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఈ రోజు ఆ ప్రాంతంలో ‘నాకా-బందీ’ (వాహనాల తనిఖీ) ఏర్పాటు చేశారు. ఈ విశ్వసనీయ సమాచారం మేరకు, సైబరాబాద్ SOT బృందం, సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ‘టెక్ పార్క్’ (Tech Park), మంచెరేవుల వద్ద నిందితుడు భగీరథ్ను మే 16వ తేదీ రాత్రి 8:15 గంటలకు అదుపులోకి తీసుకుని, పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిందితుడిని దర్యాప్తు అధికారి ఎదుట హాజరు పరచగా పోలీస్ స్టేషన్లో సాక్షుల సమక్షంలో నిందితుడిని విచారించారు. తాను సదరు నేరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో దర్యాప్తు అధికారి నిందితుడిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం, నిందితుడు భగీరథ్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.