ముంబై : ఎవరూ ఊహించని ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్ముడు పోయింది. ఈ ఏడాదిలో రెండు ఐపీఎల్ జట్లు భారీ ధరకు అమ్ముడు పోవడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆర్సీబీని ప్రముఖ భారతీయ కంపెనీ ఆదిత్య బిర్లా కంపెనీ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు వెనుక ఆ సంస్థకు చెందిన వారసురాలు అనన్య బిర్లా ఉన్నారు. ఆమె కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక తను వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కూతురు ఈ అనన్య బిర్లా.
స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తగా, అంతర్జాతీయ పాప్ కళాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ను స్థాపించి, ఆమె గ్రామీణ మహిళల కోసం ఆర్థిక చేరికకు కృషి చేస్తున్నారు. ఆమె వైవిధ్య భరితమైన వ్యాపారాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో డిజిటల్ వ్యాపారాలు, ఎం పవర్ ద్వారా మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఆదిత్య బిర్లా గ్రూప్లో వ్యూహాత్మక బోర్డు పదవులు ఉన్నాయి.
బిర్లా కుటుంబ సభ్యురాలిగా, ఆమె లోహాలు, సిమెంట్, వస్త్రాలు, ఆర్థిక సేవలు, మరిన్ని వ్యాపార వారసత్వాన్ని పొందారు. అయినప్పటికీ అనన్య బిర్లా ఒక వారసురాలిగా కాకుండా, స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తగా, వినూత్న ఆలోచనలు గల వ్యక్తిగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త ఛైర్మన్గా నియమితులైన ఆర్యమాన్ విక్రమ్ బిర్లాకు సోదరి కూడా. ఆమె అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయానికి మారారు, అక్కడ ఆమె అర్థశాస్త్రం ,నిర్వహణను అభ్యసించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్మాణాలు, కార్పొరేట్ వ్యూహంలో ఆమెకు పటిష్టమైన పునాదిని అందించింది.
